‘ఉత్సవం’ అనేది మనం గర్వపడే చిత్రాల్లో ఒకటి. ఇందులో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి: హీరో దిలీప్ ప్రకాష్

హీరో దిలీప్ ప్రకాష్ మాట్లాడుతూ, “ఉత్సవం” అనేది మనందరం గర్వపడే సినిమా అని తెలిపారు. రెజీనా కసాండ్రా తో కలిసి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ నిర్మిస్తున్నారు. ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందన పొందటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సెప్టెంబర్ 13న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఏపీ, తెలంగాణలో భారీగా విడుదల కానుంది.

సినిమా విశేషాలు పంచుకుంటూ, దిలీప్ ప్రకాష్ మాట్లాడుతూ “స్కూల్ రోజుల నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నా. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టా. అర్జున్ సాయితో నా పరిచయం కర్నాటకలో ‘క్రేజీ బాయ్’ చిత్ర సక్సెస్ మీట్ లో జరిగింది. ఆ సందర్భంలో ఆయన ‘ఉత్సవం’ కథ చెప్పారు. అలా ఈ సినిమా జర్నీ మొదలైంది” అని చెప్పారు.

“ఉత్సవం చిత్రంలో కథే ప్రధానమైనది. ప్రముఖ నటులు నటిస్తుండటం నాకు గొప్ప అవకాశం. రెజీనా గారితో వర్క్ చేయడం చాలా మంచి అనుభవం. ఆమె ఎంతో సహాయపడ్డారు. అలాగే ప్రకాశ్ రాజ్ గారి లాంటి నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కోసం గొప్ప ప్రోత్సాహం” అని చెప్పారు.

“సినిమా ఎంతో విభిన్నంగా ఉంటుంది. రంగస్థల కళాకారుల నేపథ్యంలో సురభి నాటక సమాజం స్ఫూర్తితో తీసిన ఈ చిత్రం మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తుంది. మంచి ఫ్యామిలీ డ్రామా, రోమాన్స్ కూడా ఇందులో ఉంటుంది. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకి హైలైట్. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి” అని దిలీప్ ప్రకాష్ వివరించారు.

“మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కావడం పట్ల సంతోషంగా ఉంది. ప్రముఖ సంస్థలు విడుదల చేయడం వల్ల ఈ సినిమాకి మరింత హైప్ వచ్చింది” అని పేర్కొన్నారు.