రష్మిక మందన్నా చేతుల మీదుగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఐ.డి, హెల్త్ కార్డ్ ల పంపిణీ

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టిఎఫ్‌జేఏ).. సభ్యుల సంక్షేమం నిరంతరం కృషి చేస్తోన్న సంఘం. సంఘ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దలా కాపు కాస్తోంది టిఎఫ్‌జేఏ. ఇందులో చేరిన ప్రతి సభ్యుడి కుటుంబానికి మూడు లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో పాటు టర్మ్ పాలసీ, యాక్సిడెంటల్ పాలసీలను ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం పరిశ్రమ సహాయ సహకారాలతో పాటు అందరు సభ్యుల తోడ్పాటును తీసుకుంటోంది. ఈ యేడాది (2023 మార్చి 2024 మార్చి) వరకూ సభ్యుత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు, హెల్త్ కార్డ్స్ ను అందించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య అతిథిగా హాజరు కాగా.. గౌరవ అతిథులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేనిగారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ గారు, షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారితో పాటు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్.పి, ఏసియన్ సినిమాస్ సిఎమ్ఓ జాన్వీ నారంగ్ గారు హాజరయ్యారు. ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టిఎఫ్‌జేఏ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ..

“మేం పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చేసిన నిర్మాతలు, రష్మిక మందన్నా గారికి ధన్యవాదాలు. మొదట మేం అడగ్గానే మాకు సహాయ సహకారాలు అందించిన దిల్ రాజు గారికి కృతజ్ఞతలు. ఆ సంవత్సరం ఆయన మాకు ఇన్సూరెన్స్ కు అవసరమైన మొత్తాన్ని ఇస్తానని చెప్పారు. అలాగే పెద్ద సంస్థలు అన్నీ కూడా ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కొక్కళ్లు చేస్తే బావుంటుంది అని ఆయనే సలహా ఇస్తూ.. ముందుగా మాకు అండగా నిలబడ్డారు. మా మిత్రుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చి.. 40రోజుల పాటు కోమాలో ఉన్నారు. మరో ఇద్దరు ముగ్గురు మిత్రులకు యాక్సిడెంట్ అయ్యి చాలా రోజుల పాటు నడవలేని స్థితికి వెళ్లారు. ఆ సమయంలో వారి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాయి. ఈ ముగ్గురు నలుగురికి కలిగిన సమస్యలను బేస్ చేసుకుని ఒక సంఘంగా ఏర్పడి ఒకిరికొకరు సాయం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఫలితమే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ఐదేళ్లుగా హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాం. ఇందుకోసం మేం అడగ్గానే దర్శకులు, నిర్మాతలు అందరూ సహకరిస్తున్నారు. మేం చేస్తోన్న ఈ కార్యక్రమాలూ, ఇన్సూరెన్స్ గురించి తెలిసి చిరంజీవి గారు అడగకుండానే మాకు సాయం చేశారు. కరోనా టైమ్ లో ఎవరూ ఎవరికీ సాయం చేసుకోలేని పరిస్థితిలు వచ్చినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడుతున్న వారికి ఒక 60మందికి మొదటి సారి నెలవారీ సరుకులు అందచేశాం. ఒక్కోసారి మా యూనియన్ లో లేకపోయినా సాయం చేశాం. ఒక మిత్రుడినికి వాళ్ల అమ్మగారు చనిపోతే.. ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా సాయం చేశాం. ఇలా చాలామందికి మా సంఘం ద్వారా సాయం చేశాం. వీటితో పాటు భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. ఇక ఈ యేడాదికి సంబంధించి విశ్వ ప్రసాద్ గారిని ఇన్సూరెన్స్ గురించి చెప్పగానే.. వెంటనే స్పందించారు. ప్రస్తుతం ఇన్సూరెన్స్ గురించి ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లినా.. వాళ్లే మమ్మల్ని అడుగుతున్నారు.. ఈ యేడాదికి ఎంత అవుతుంది.. అని. ఆ స్థితికి మన సంఘం చేరుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా ఎప్పుడు వెళ్లినా.. వచ్చి అడగాల్సిన పనిలేదు. మీ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తాం అంటున్నారు.. చేస్తున్నారు. అలాగే సాహు గారు కూడా.. ఒక్క మాట చెబితే చాలు.. వెంటనే మాకు కావాల్సింది చేస్తున్నారు. అలాగే సునీల్ నారంగ్ గారు కూడా మేం అడిగిన రెండు గంటల్లోనే స్పందించారు. ఇలాంటి కార్యక్రమానికి రష్మిక గారు రావడం ఆనందంగా ఉంది. మామూలుగా వాళ్లు పిలిస్తే మనం(జర్నలిస్ట్ లు) వెళతాం. అలాంటిది మన కార్యక్రమానికి రష్మిక గారు రావడం.. సంతోషంగా ఉంది. అలాగే రష్మిక గారు కూడా స్పందింస్తారని ఆశిస్తున్నాను.. అందరికీ థ్యాంక్యూ వెరీ మచ్ .. ” అన్నారు.

టిఎఫ్‌జేఏ ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు మాట్లాడుతూ.. ” పిలవగానే విచ్చేసిన మా ముఖ్య అతిథి ప్యాన్ ఇండియా హీరోయిన రష్మిక గారికి కృతజ్ఞతలు. విశ్వ ప్రసాద్ గారికి, నవీన్ గారికి, సాహు గారికి, జాన్వీ గారికి థ్యాంక్యూ. వీరు అడిగిన వెంటనే స్పందించడానికి, పిలవగానే రావడానికి కారణం.. మన అసోసియేషన్ కు ఉన్న గుడ్ విల్. వీళ్లు మాకు ఎంతో చేస్తున్నారు. మరి మనం వారికి ఏం చేస్తున్నాం అనిపించినప్పుడు రీసెంట్ గా దిల్ రాజు గారు, చిరంజీవి గారుతో అసోసియేషన్ తరఫున సినిమా కోసం ఏం చేయాలి అని మాట్లాడటం జరిగింది. మన జర్నలిస్ట్ లకు వాళ్లు అంత సాయం చేస్తున్నప్పుడు.. వారికి సమస్యలు వచ్చినప్పుడు జర్నలిస్ట్ లుగా మనం చేయాలని అని చర్చించడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఎక్కువ నాన్సెస్ జరుగుతోంది. వీటిలో ఎక్కువగా ఇబ్బంది పడేది సెలబ్రిటీసే. హీరోలు, హీరోయిన్లపై ఏది పడితే అది రాస్తున్నారు. అలాంటప్పుడు వాళ్లు ఒంటరిగా ఫైట్ చేయలేరు. సినిమాలు, షూటింగ్స్ ఉంటాయి. అలాంటప్పుడు మా అసోసియేషన్ తరఫున మే అండగా ఉంటాం అని చెప్పడం జరిగింది. ఈ మేరకు పోలీస్ డిపార్ట్ మెంట్, లాయర్స్, ఛాంబర్, మా అసోసియేషన్ వారితో మాట్లాడి ఓ కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీలో మా సభ్యులు కూడా నలుగురు ఉంటారు. దీని వల్ల ఇకపై ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ కు వచ్చే సమస్యలు తీరేవరకూ మేం ఫైట్ చేస్తాం. ఇది చెప్పగానే చిరంజీవి, దిల్ రాజు గారూ అద్భుతమైన ఐడియా అని మెచ్చుకున్నారు. వెంటనే ప్రారంభించమని ప్రోత్సహించారు. అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా చూసుకుని ఈ కమిట్ స్టార్ట్ చేయబోతున్నాం. ఏదో ఒక సమస్య వస్తే మొత్తం మీడియాను బ్లేమ్ చేస్తున్నారు. తప్పులు అందరూ చేయరు. చేసిన ఒకరిద్దరి వల్ల మొత్తం సమస్య రాకూడదు. ఇంతకు ముందు మా అసోసియేషన్ తో పాటు ఇతర అసోసియేషన్స్ లో ఫిర్యాదులు చేసేవారు. ఇకపై ఎవరైనా ఏదైనా సమస్య గురించి మన కమిటీకి చెబితే ఆ సమస్య తీరేవరకూ జర్నలిస్ట్ లుగా మనం తీసుకోబోతున్నాం. ఇది భవిష్యత్ లో జరగబోయే కార్యక్రమం. ఇక టిఎఫ్‌జేఏ అసోసియేషన్ కోసం మూడు రకాల ఇన్సూరెన్స్ లు చేశాం. ఒకటి నలుగురు కుటుంబ సభ్యులున్న ఫ్యామిలీకి 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్. మిగతావి టర్మ్ పాలసీ, యాక్సిడెంటల్ పాలసీ. వీటిలో మొదటిది ఎవరికైనా జరిగితే.. ఆ కుటుంబానికి ఈ మొత్తం అందించడం జరుగుతుంది. యాక్సిడెంటల్ పాలసీలో ఎవరైనా ప్రమాదం బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉంటే.. వారానికి పదివేల చొప్పున.. అసవరమైతే ఐదేళ్ల వరకూ ఈ పాలసీ వర్తిస్తుంది. ఈ మూడు ఇన్సూరెన్స్ ల కోసం చాలా పెద్ద కంపెనీలను సంప్రదించాం. వారిలో మనకు నచ్చేలా యతిక ఇన్సూరెన్స్ వాళ్లు ముందుకు వచ్చారు. వారి తరఫున, మన తరఫున ఇద్దరు ప్రతినిధులను పెట్టాం. వీరిలో ఎవరిని సంప్రదించినా.. 24 గంటలూ అందుబాటులో ఉండబోతున్నాం. ఇప్పటి వరకూ మనం ఇప్పటి వరకూ కోటి పది లక్షలు ఇన్సూరెన్స్ కట్టాం. మనం క్లెయిమ్ చేసింది 90లక్షలకు పైనే ఉంటుంది. ఎవరూ హాస్పిటల్ కు వెళ్లాలనుకోరు. అందుకే ఆ బాధ్యత అసోసియేషన్ తీసుకుంది. ఈక్రమంలో ఇండస్ట్రీ మొత్తం మాకు అండగా నిలిచింది. ఏ విషయంలోనూ అబ్జెక్షన్స్ పెట్టలేదు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించబోతోన్న మన టిఎఫ్‌జేఏ కు మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ.. థ్యాంక్యూ.. ” అన్నారు.

యతిక ఇన్సూరెన్స్ ప్రతినిధి శివ మాట్లాడుతూ.. ” మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిందుకు అందరికీ థ్యాంక్యూ సో మచ్. టిఎఫ్‌జేఏ తో మా అసోసియేషన్ ఐదేళ్లుగా కొనసాగుతోంది. ఈ ఐదేళ్లలో 96 హాస్పిటల్ క్లెయిమ్స్ చేశాం. 2 డెత్ క్లెయిమ్స్, ఒక యాక్సిడెంటల్ క్లెయిమ్స్ చేశాం. ఇందుకోసం 50 లక్షల 50 వేల వరకూ ఇచ్చాం. గతేడాది మా డైరెక్టర్ రాజేంద్ర గారు ప్రామిస్ చేసినట్టుగా గత డిసెంబర్ లో హెల్త్ చెకప్స్ చేశాం. టిఎఫ్‌జేఏ వారితో మా అనుబంధం ఇలాగే కొనసాగాలి. ఎవరికీ ఏ ఇబ్బంది రాకూడదని కోరుకుంటున్నాం.. ఒక వేళ వచ్చినా 24 గంటలూ మేం అందుబాటులో ఉంటాం అని ప్రామిస్ చేస్తున్నా.. ” అన్నారు.

టిఎఫ్‌జేఏ ట్రెజరర్ నాయుడు సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. “టిఎఫ్‌జేఏ నుంచి ఇప్పటి వరకూ ఈ ఐదేళ్లలో మనం ఇన్సూరెన్స్ సంస్థకు కట్టిన డబ్బులు 1 కోటి 10 లక్షలు 84వేల 626 రూపాయలు. ఈ మొత్తంలో మనం చేసుకున్న క్లెయిమ్ చేసుకున్న అమౌంట్ 90 లక్షల 76 వేల 614 రూపాయలు. ఈ మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి 60లక్షల 26 వేల 614 రూపాయలు క్లెయిమ్ చేశాం. టర్మ్ ఇన్సూరెన్స్ 30 లక్షలు క్లెయిమ్ చేశాం. ఈ రెండూ డెత్ క్లెయిమ్స్. ఒకటి బిఏ రాజుగారు, మరోటి లక్ష్మినారాయణరావు గారు. పర్సనల్ యాక్సిడెంటల్ 50వేలు క్లెయిమ్ చేశాం. అందరికీ ఏ ప్రాబ్లమ్ రాకూడదు. సంతోషంగా ఉండాలనే కోరుకుందాం. కానీ ఏదైనా అనుకోని సమస్య వచ్చినప్పుడు 24 గంటలూ ఎంతో మద్ధతుగా నిలుస్తున్నాం.. ఇప్పటి వరకూ మనం కట్టిన, క్లెయిమ్ చేసిన అమౌంట్స్ ఇవి.. థ్యాంక్యూ..” అన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ లో నిర్మాతల్లో ఒకరైన నవీన్ యొర్నేని మాట్లాడుతూ.. ” అందరికీ నమస్కారం. మేం సినిమాలు తీసిన తర్వాత వాటిని జనాల్లోకి తీసుకువెళ్లేది జర్నలిస్ట్ లే. ఆ విషయంలో మీరెప్పుడూ మంచి సపోర్ట్ చేస్తున్నారు. సో.. మా వైపు నుంచి వారికి ఏ సహాయం కావాలన్నా ఉంటాము. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ పెద్దగా మారి అందరికీ హెల్ప్ కావాలని కోరుకుంటూ థ్యాంక్యూ.. ” అన్నారు.

నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. ” మా సినిమాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్న జర్నలిస్ట్ లందరికీ థ్యాంక్యూ. టిఎఫ్‌జేఏ నుంచి ఇది గొప్ప నిర్ణయంగా భావిస్తున్నాను. టిఎఫ్‌జేఏ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సపోర్ట్ గా ఉంటుందని తెలియజేస్తున్నాను.. ” అన్నారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్.పి, ఏసియన్ సినిమాస్ సిఎమ్ఓ జాన్వీ నారంగ్ మాట్లాడుతూ.. ” ఈ కార్యక్రమానికి నాన్నగారు ఈ రోజు రాలేకపోయారు. టిఎఫ్‌జేఏ కి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది…” అన్నారు.

నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. ” ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. టిఎఫ్‌జేఏ మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తుందనీ.. సభ్యులందరికీ మరిన్ని ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తుందని ఆశిస్తూ.. మంచి పనులు చేస్తున్న అసోసియేషన్ వారికి ఆల్ ద బెస్ట్.. ” అన్నారు.

ముఖ్య అతిథి రష్మిక మందన్నా మాట్లాడుతూ.. ” అందరికీ నమస్కారం. ఒక యూనియన్ అందరి క్షేమం కోసం ఆలోచించడం చూస్తే సంతోషంగా ఉంది. మామూలుగా మా సినిమాలకు సంబంధించిన ఏ ఫంక్షన్ జరిగినా మీరంతా వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు పిలవగానే నేను రావడం హ్యాపీగా ఉంది. మీరంతా బావుండాలి. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్యూ. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. ఇకపై కలుస్తూనే ఉంటా.. ” అన్నారు.