–మన ఆయుర్వేదం ప్రపంచమంతటా విస్తరించడం ఆనందదాయకం: కేవీ రమణచారి

ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా వుండాలనే సంకల్పంతో నెలకొల్పిన అందరికి ఆయుర్వేదం సంస్థ ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరించడం ఎంతో ఆనందంగా, గర్వంగా వుంది అన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, కల్చరల్ గౌరవ సలహాదారులు డా.కేవీ రమణచారి.హైదరాబాద్‌లో ఏల్చూరి ఆయుర్వేద ప్రయివైట్ లిమిటెడ్‌సంస్థ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డా.ఏల్చూరి ఆయుర్వేద వారసత్వాన్ని ఆయన తనయుడు డా.రాజా రంజిత్ కొనసాగించడం, ఆయుర్వేద ప్రాముఖ్యతను ప్రపంచమంతటా చాటిచెప్పాలనే సంకల్పంతో ముందుకు సాగడం ఎంతో సంతోషంగా వుందని పేర్కొన్నారు. ఈ సంస్థ మూడు పువ్వులు ,ఆరు కాయలుగా వెలిగిపోవాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ సంస్థ గొప్ప ఆశయంతో ముందుకుపోవడం ఆనందంగా వుందని, ఆయుర్వేద గొప్పతనం ప్రపంచమంతటా తెలియజేయడం కోసం ఈ సంస్థ నడుం బిగించడం గొప్ప విషయమని ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిలుగా పాల్గొన్న సినీ కథానాయకులు నారా రోహిత్, శ్రీవిష్ణు తెలిపారు. సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డా.రాజా రంజిత్ మాట్లాడుతూ అందరూ బాగుండాలి.. అందులో మనం వుండాలి అనే నాన్న గారి మాటల స్ఫూర్తితో ఆయన బాటలో భాగంగా ఆయుర్వేదంను ఇతర దేశాల్లో కూడా విస్తరించాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాను. నాకు తోడుగా వినయ్ గారి ప్రోత్సాహంతో ఇండియాలో ఏల్చూరి స్టోర్స్‌తో పాటు, వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ బద్రినాథ్, సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వినయ్, రూపేష్ ఫణి సాయిరాం, డా.రాజా రంజిత్‌లతో పాటు సురేందర్, మూర్తి, కూర విశ్వనాథ్, డా.జ్ఞానేశ్వరి, డా.వైదేహి తదితరులు పాల్గొన్నారు.